Friday 10 April 2015

పదేళ్ళ క్రితమే ఊహించిన రాజధాని అమరావతి -డా. జి వి పూర్ణచందు

పదేళ్ళ క్రితమే ఊహించిన రాజధాని అమరావతి -డా. జి వి పూర్ణచందు
కృష్ణా తీరంలోని ప్రాచీన రాజధాని నగరాల గురించి 2005లో మొదలు పెట్టి దాదాపు నలబై వారాలపాటు రేడియో ప్రసంగాలు చేశాను. 2006లో “అలనాటి పట్టణాలు పేరుతో పుస్తక రూపంలో ఈ వ్యాసాలు వచ్చాయి. అందులో అమరావతి గురించి వ్రాస్తూ, “భవిష్యత్తులో ఇది మళ్ళీ తెలుగువారి రాజధాని నగరం అయినా ఆశ్చర్యం లేదనీ, ఆ క్షేత్ర మహాత్మ్యం అలాంటిదనీ వ్రాశాను. ఒకనాటికి అమరావతికి ప్రాధాన్యత వస్తుందనే నమ్మకం గట్టిగా ఉండేది మా జీవిత కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి అవతరించ నుండటం ఆనందంగా ఉంది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏ వూరును పలకరించినా తట్టలకొద్దీ చారిత్రక అంశాలను తవ్వి పోస్తుందనీ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన, మహత్తు కలిగిన క్షేత్రాలనూ, ఆ చరిత్రనూ మనం అలక్ష్యం చేయకూడదని చరిత్ర ఒక పాఠం నేర్పుతోంది. బౌద్ధం, జైనం, శైవాలకు ఆనాటి అమరావతి నెలవుగా ఉండేది. శాతవాహనులతో ప్రారంభించి బ్రిటిషర్ల వరకూ ప్రతి రాజవంశమూ అమరావతి కేంద్రంగా పాలించింది. కాకతీయ ప్రతాప రుద్రుడు చాలా కాలం ఇక్కడే ఉన్నాడు. ఆయన కాలంలో జైనులను మోసపూరితంగా కాశీ పండితులు ఓడించటం, ఓడిన జైనుల్ని గానుగలో వేసి ఆడించటం లాంటి కథలు ఇక్కడే జరిగాయని గుంటూరుజిల్లా కైఫీయత్తుల్లో ఉంది. బ్రిటిషర్ల ప్రోద్బలంతో ౩౦౦ మంది చెంచు జాతి ఆదివాశీలను కుట్రపూరితంగా చంపిన సంఘటన కూడా అమరాతికి సంబంధించిన కథే! వీటిని అలా ఉంచితే ఇది బుద్ధుడు స్వయంగా ఇక్కడకు వచ్చి, కాలచక్ర తంత్రాన్ని నేర్పించాడని తాను నమ్ముతున్నట్టు ప్రకటించిన దలైలామా అమరావతి నగర ప్రశస్తిని లోకానికి చాటాడు.
రెండు శతాబ్దాల క్రితం, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారికి అక్కడ తాను త్రవ్విస్తున్న మట్టి దిబ్బ అడుగున తొలి బౌద్ధ చైత్యారామాలలో ఒకటైన బౌద్ధ స్తూపం ఉందని, దాన్ని ధ్వంసం చేస్తున్నాననే గ్రహింపు లేదు. రాజధాని నిర్మించటమే ఆయన ధ్యేయం. ఇప్పుడుకూడా అదే తప్పు జరక్కూడదు. రాజా వారి కాలాని కన్నా చారిత్రక అవగాహన ఎక్కువగా ఉన్న యుగం ఇది. రాజధాని నిర్మాణ ఆత్రుతలో మట్టితో కప్పబడిన చరిత్రని అప్పటిలాగా తవ్వించేస్తే, విలువైన చారిత్రక వారసత్వ సంపదను నష్టపోయే ప్రమాదం ఉంది. భారతీయ పురావస్తు పరిశోధనల శాఖ(A.S.I.)వారు ముందుగా మేల్కొని చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. జరగకూడని నష్టం జరిగాక అయ్యో అనుకున్నా ప్రయోజనం ఉండదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు అమరావతి అని ఆ ఊరికి వెంకటాద్రి నాయుడు నామకరణం చేయటం గురించి ఘనంగా చెప్పారు. రాజావారి స్ఫూర్తిని మన ముఖ్యమంత్రిగారు పొందినట్టు కనిపిస్తోంది. చారిత్రక స్థలాల పరిరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటే ఇది ఆహ్వానించదగిన అంశమే!
అమరావతి బౌద్ధ స్తూపంలోని మొత్తం ఫలకాలలో పోయినన్ని పోగా ఆనాటి బ్రిటిష్ అధికారులు తస్కరించినన్ని తస్కరించగా, మిగిలినవి కొన్ని ఇప్పటి అమరావతి మ్యూజియంలోనూ, మద్రాస్ మ్యూజియంలోనూ ఉన్నాయి. ఎక్కువ భాగం లండన్ నగరంలోని బ్రిటిష్ మ్యూజియంలో ఒక ప్రత్యేక అంతస్తులో చలువమందిరంలో భద్రంగా ఉన్నాయి. గుడివాడ బౌద్ధ స్తూపంలో దొరికిన బుద్ధుని అస్థికల భరిణలు మూడు కూడా అక్కడే ఉన్నాయి. శ్రీ బుద్ధప్రసాద్ గారితోనూ శాసనమండలి అధ్యక్షులు శ్రీ చక్రపాణిగారితోనూ కలిసి ఈ బ్రిటిష్ మ్యూజియంను సందర్శించే భాగ్యం నాకు కలిగింది.

Dr. G V Purnachand, B.A.M.S.,: ధనలక్ష్మి లేని రాజధాని :: డా. జి వి పూర్ణచందు

Dr. G V Purnachand, B.A.M.S.,: ధనలక్ష్మి లేని రాజధాని :: డా. జి వి పూర్ణచందు: ధనలక్ష్మి లేని రాజధాని డా . జి వి పూర్ణచందు “ వెలయు నఖిల భువనములలోన వారణ నగరిపు రమ తల్లి నా దనర్చి రాజ్యలక్ష్మి మిగ...

రేపటి రాజధాని :: డా. జి. వి. పూర్ణచందు

రేపటి రాజధాని
డా. జి. వి. పూర్ణచందు
తగ గోట దాచిన మగమానికంబుల/తెలిరంగు లెపుడు వెన్నెలలు గాయ
మేడలపై నాడు మెలతలు దెఱగంటి/కొమ్మలు నే ప్రొద్దు గూడి తిరుగ
జిలువ చామ లగడ్త వలినీటిపై దేలి/యెరిమతో ననయంబు నోలలాడ
మేలిమి బంగారు మేని పచ్చల చాలు/మిసిమి మింటికి నెల్ల బసిమి యొసగ
జదల రాసిన కొమ్మల చాలు కతన
మీద రారాక యల ప్రొద్దు మెఱుగు దేఱు
గవనులనె రాక పోకలుగా మెలంగ
దనరు బుడమి బ్రతిష్ఠాన మనగ వీడు
          రాజధాని అంటే ఇలా ఉండాలి. అంతటి రాజధానిని రోజుల్లో కట్టటానికి మయుడు అనే గొప్ప సివిలు ఇంజనీరు మన పురాణేతిహాసాల్లో ఉండేవాడు. తరువాత ఆయన తన సంతతితో సహా మెక్సికో వెళ్ళి స్థిరపడ్డాడని కొందరు, లేదా మెక్సికో నుండే వచ్చాడని కొందరు వాదిస్తూ ఉంటారు. భిక్షూ చమన్లాల్ అనే పరిశోధకుడుహిందూ అమెరికాఅనే గ్రంథంలో మెక్సికోలోని మయాజాతి ఆదిమ రెడ్డిండియన్లకు భారతీయ నేపథ్యం ఉందన్నాడు. సరే, అది వేరే కథ.
          ప్రతిష్ఠానపుర రాజధాని నగర వర్ణనలోకి వద్దాం. `తగ గోట దాచిన మగమానికంబుల తెలిరంగు లెపుడు వెన్నెలలు గాయ నగరంలో రాజుగారి కోట ఉండేది. కోట అంటే సెక్రెటేరియట్, అసెంబ్లీ, గవర్నరుగారుండే రాజభవన్, ముఖ్యమంత్రిగారి క్యాంపు ఆఫీసు, నివాసం, ఎమ్మెల్యేల ఇళ్ళు, మంత్రుల పేరోలగాలు, వీటన్నీంతోపాటు అన్నీ దొరికే ఆరో ఏడో నక్షత్రాల హోటళ్ళువగైరా ఉండే చోటు. ఇవన్నీ ఒకే చోట ఉంటేనే అది రాజధాని అవుతుంది. కోట గోడలకు మగమాణిక్యాలు తాపటం పెట్టించారట. మణులకు లింగభేదం ఏవిటా అనుకోవద్దు, మగమాణిక్యాలంటే శ్రేష్ఠమైన మణులు. వాటి తెలిరంగులు తళతళలాడుతూ పగలే వెన్నెలలు కాయిస్తాయిట.
కోట లోపల, కోట బయట అన్నీ మేడలేమేడంటే మేడ కాదుఒక్కోటీ ఆకాశాన్నంటేంత గొప్ప మేడ. విమానాలు కూడా తన ఎత్తు పెంచుకుని నగరం మీంచి ఎగరాలన్నంత ఎత్తైన మేడలు. మేడలపై నాడు మెలతలు దెఱగంటి కొమ్మలు నే ప్రొద్దు గూడి తిరుగ
వాటి పైన మెలతలు అంటే చక్కనమ్మలు  ఆడుకుంటున్నారట. తెరగంటి కొమ్మలు-కన్నార్పకుండా చూడగల నేర్పరులైన  అప్సరసలతో మెలతలు ముప్పొద్దులా కలిసి తిరుగుతారట. మేడల మీదే ఎందుకు తిరుగు తారంటే కింద నేల మీద తిరగటానికి జాగా లేదు కాబట్టి! గజం స్థలం ఉంటే అక్కడొక మేడ కట్టేయాలన్నంత పరిస్థితి! ముప్పై వేల ఎకరాలు మూలకి? ప్రపంచంలో దేశానికీ లేనంత రాజధాని కదా! ఆడవాళ్ళు ఆడుకోవాలన్నా, మార్నింగు వాకులు చేయాలన్నా అన్నీ టెర్రేసుల మీదే!
జిలువ చామ లగడ్త వలినీటిపై దేలి/యెరిమతో ననయంబు నోలలాడ…” కోట చుట్టూ పెద్ద అగడ్త ఉంది. రాజధానికి భూము లివ్వనన్న వాళ్ళూ, భూములు బలంగా లాక్కోవటాన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష శత్రు మూక కోటలో ప్రవేశించకుండా చుట్టూ తవ్వించిన లోతైన కందకం అది! అగడ్త వలినీళ్ళలో చిలువ చామలు అంటే నాగకన్యలు పాతాళం నుండి వచ్చి ఒరిమ(అందంగా)తో అనయంబుగా (ఎల్లవేళలా) తేలి ఆడుతూ ఉంటారట. మన ఊరునుండి భూమిలోపలికి తిన్నగా తవ్వుకొంటూ పోతే చివర అమెరికాలో ఎక్కడో ఒక చోట తేలతాం. అందుకని అమెరికాని పాతాళ లోకంగా భావిస్తారు పండితులు. పాతాళం పాములకు పుట్టిల్లు. అందమైన పాములు రాజధాన్ని చుట్టుకుని తేలియాడుతుంటాయి.
మేలిమి బంగారు మేని పచ్చల చాలు/మిసిమి మింటికి నెల్ల బసిమి యొసగమేలిమి బంగారంతో కోట శిఖరాల్ని తాపటం చేశారట. బంగారు రేకులమీద గరుడపచ్చలు పొదిగారట. రెండింటిచాలుమిసిమిఅంటే తళతళలతో ఆకాశం అంతా పచ్చరంగులోకి మారిపోయింది. ఎక్కడ చూసినాపసుపురంగుతాండవిస్తోందట.
చదల రాసిన కొమ్మల చాలు కతన మీద రారాక యల ప్రొద్దు మెఱుగు దేఱు కోట కొమ్మల చాలు అంటే కోటశిఖరాలు లేదా , బురుజుల శ్రేణి. అవి చదల రాసుకొంటో్న్నాయట. చదలం అంటే, ఆకాశానికి అచ్చతెలుగు పేరు. చదలంతో కోట బురుజులు రాసు కుంటున్నాయిట. నేలనే కాదు, ఆకాశం అంతా రాజధాని కోటలూ మేడలే ఆక్రమించటంతో సూర్యుడి రధచక్రాలకు అవి తగుల్తున్నాయి. దాంతో సూర్యుడు రాలేకపోయాడు. ఇంకచంద్రకాంతికి తిరుగులేకుండా పోయిందని భావార్ధం. చేసేది లేక చంద్రన్న’’కి తలవంచి నేల మీద ఆరులైన్ల రహదారుల పైన తిరుగుతున్నాట్ట సూర్యుడు. అందుకని వీధులన్నీ వెలిగి పోతున్నాయి
పుడమి మీద ప్రతిష్ఠానం పేరుతో ఒక వీడు తనరారుతోందంటాడు పొన్నెగంటి తెలగన్న! కవిగారు 16 శతాబ్దిలో గోల్కొండ ప్రభువు ఇబ్రహీం కుతుబ్ షా (మల్కిభరాముడు) దగ్గర అమీనాగా పనిచేసేవాడు. ఈయన తెలగన్న కాదు తెలుగన్నే! అచ్చ తెలుగు పదాలతోయయాతి చరిత్రవ్రాశాడు. అందులోది పద్యం.
కవిగారు గతంలోకి చూసి వర్ణన చేశాడో లేక భవిష్యత్తులోకి తొంగి చూసి రేపటి రాజధాని గురించి వ్రాశాడో తెలియదు. రాజధానిలో సామాన్యులు ఎక్కడ, ఎలా నివసించారో ఆయన చెప్పలేదు. వారిని రాజధాని లోపలికి రానీయకుండా గ్లోబల్ పాములు అడ్డుకున్నాయా?