Monday 26 September 2016

కొవ్వులో కేలరీలు.. ఊబకాయం :: డా. జి వి పూర్ణచందు

కొవ్వులో కేలరీలు.. ఊబకాయం (మీకు మీరే డాక్టర్)
Published Tuesday, 13 September 2016 Andhrabhoomi daily
ఆహారం ద్వారా శరీరానికి కేలరీలు అందుతాయి. ఆ కేలరీలను ఖర్చుపెట్టడం ద్వారా శరీరం శక్తిని పొంది తన పనులు తాను సమకూర్చుకుంటుంది. వచ్చిన కేలరీల ఆదాయంలోంచి చేసిన కేలరీల ఖర్చుని తీసేయగా మిగిలిన కేలరీల సంపద లెక్కల్లో చూపని నల్లడబ్బు లాంటిది. దాన్ని దాచుకోవటానికి రహస్య స్థావరాలు కావాలి. శరీరంలో బాగా వదులుగా ఉండే కొవ్వు కణాలలో ఈ అదనపు కేలరీలను శరీరం దాచిపెడుతుంది. వదులుగా ఉండే కొవ్వు కణాలలో కేలరీలు దాగడంతో ఆ కొవ్వు కణాలు వాటి పరిమాణాన్ని మించి ఉబ్బుతాయి. అందువలన వదులుగా ఉండే కొవ్వు పొరలు శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ లావుగా తయారౌతాయి. ఊబకాయం ఏర్పడుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రవర్తకుల్లో ఒకరైన చరకుడు ‘బహ్వబద్ధా మేదాః’ అంటూ ఒక సూత్రంలో ఈ కేలరీల కథనంతా వివరించాడు. బద్ధం అంటే బాగా బిగుతుగా ఉండటం. అబద్ధం అంటే వదులుగా ఉండటం. ‘బహు అబద్ధం’ అంటే, బాగా లూజుగా వుండే కొవ్వు (లూజు ఎడిపోసె టిష్యూ)లో చేరి స్థూలకాయాన్ని తెస్తున్నాయని చెప్పాడు.
చర్మం అడుగున వుండే కొవ్వు పొరల్ని ఎడిపోజ్ పొరలంటారు. ఇవి అదనపు కేలరీలను దాచుకోవడానికి నేలమాళిగల్లాంటివి. శరీరంలో పొట్ట, పిరుదులు, డొక్కలు, రొమ్ములు, పిర్రలు ఈ ప్రాంతాల్లో ఉండే ఎడిపోజ్ పొరలు బహు అబద్ధంగా అంటే బాగా లూజ్‌గా ఉండి, అక్కడ ఆ కేలరీలు ఎక్కువగా చేరేందుకు అవకాశాలుంటాయి. కేలరీల ఖర్చు తగ్గి, ఆహారం ద్వారా కేలరీల ఆదాయం పెరుగుతూన్న కొద్దీ అదనపు కేలరీలన్నీ ఈ పొట్ట, పిరుదుల్లో చేరి, అవి ఉబ్బి ఊబకాయం ఏర్పడుతుంది.
కేలరీలన్నింటినీ లాకరులో పెట్టినట్లు ఈ కొవ్వులో దాచటంవలన, శరీర వినియోగానికి చాలా పరిమితంగా కేలరీలు అందుతాయి. దాంతో అదనపు కేలరీల కోసం మెదడులోని నాడీ కేంద్రాలు ఆకలిని ప్రేరేపిస్తాయి. తిండి ధ్యాస విపరీతంగా పెరిగిపోతుంది. వెర్రి ఆకలి పుడుతుంది. ఎంత తిన్నా ఈ నీరసం తగ్గటం లేదనిపిస్తుంది. అటు ఊబ శరీరమూ, ఇటు ఆకలీ రెండూ ఒకదాన్నొకటి పెంచుకుంటూ పోతాయి. మెటబాలిజం అంటే, శరీర నిర్మాణ క్రియలు దానివలన నిలిచిపోతాయి.
ఇలా కొవ్వులో కేలరీలు బందీ కావటానికి జీవరసాయన కారణాలు, జెనెటిక్ కారణాలు చాలా ఉన్నాయి. శరీర శ్రమ, భోజనం చెయ్యగానే నిద్ర, మానసిక ఆందోళనలు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరగకపోవటం వాటికి తోడౌతాయి. షుగరు రోగులకు ఇన్సులిన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు బరువు పెరగటాన్ని, ఇన్సులిన్ తగినంత లేనప్పుడు బరువు తగ్గటాన్నీ మనం గమనించవచ్చు. ఇన్సులిన్ ఇస్తున్నకొద్దీ కేలరీలు ఖర్చయిపోయి ఆకలి డిమాండ్ ఏర్పడుతుంది.
తినకుండా పూర్తి పస్తు ఉంటే కొవ్వులో దాగున్న కేలరీలు బయటకొస్తాయనేది పూర్తి వాస్తవం కాదని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. ఉపవాసాలు స్థూలకాయానికి విరుగుడు కాదు.
శరీరానికి ఎంత శ్రమ ఉన్నదో అంతకు తగిన కేలరీలను మాత్రమే తీసుకోగలగటం ఊబకాయానికి నివారణా సూత్రం. ఆకల్ని బట్టి కాకుండా శరీర శ్రమను బట్టి ఆహారాన్ని తీసుకోవటానికి పథక రచన చేసుకోవాలి. శరీర పరిశ్రమ లేకుండానూ, కొవ్వు పదార్థాలను ఆపకుండాను, కేవలం డైటింగ్ చేస్తే ఊబకాయం తగ్గకపోకా పెరిగిపోతుంది.
టిఫిన్లకు అల్పాహారం అనే పేరు పెట్టడంవలనే కొన్ని అపోహలు కలుగుతున్నాయి. గట్టిగా పోలిస్తే, మన టిఫిన్లు అన్నం కన్నా ఎక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. మినప్పప్పు, ఉప్పుడు రవ్వ కలిపి వేసిన ఇడ్లీలలో గానీ, మినప్పప్పు బియ్యం కలిపి రుబ్బి వేసిన అట్లలో గానీ ఉండే కేలరీలకన్నా, ఉదయాన్నో రాత్రిపూటో కొద్దిగా తినే పెరుగున్నం లేదా చల్లన్నంలో తక్కువ కేలరీలే ఉంటాయి. టిఫిన్లలో అదనంగా శనగచట్నీ, అల్లప్పచ్చడి, నెయ్యి, కారప్పొడి, సాంబారు కూడా ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా చల్లన్నం కన్నా చాలా ఎక్కువ కేలరీలను శరీరానికి అందిస్తాయి. అన్నం మానేసి ఇడ్లీ అట్టు, పూరీ ఉప్మా, బజ్జి, పునుగులు తింటూ చాలా లైట్‌ఫుడ్ తింటున్నామనుకోవడం ఒక అపోహ. ఇవి కాకపోతే బట్టర్‌నానూ, రుమాల్ రోటీ లాంటి వాటిని రకరకాల కర్రీలతో తింటూ అవి కూడా లైట్ ఫుడ్ అనే అనుకుంటుంటారు చాలామంది.
జంకుఫుడ్స్ అనేవి పిజ్జాలు, బర్గర్లు చైనా నూడుల్స్- ఇవి మాత్రమే అనుకోవద్దు. ఇంట్లో మనం తినే టిఫిన్లన్నీ జంకు ఫుడ్స్ కేటగిరీల్లోకే వస్తాయి. ఏవి ఎటువంటి పోషకాలూ ఇవ్వకుండా, కేవలం అమితమైన కేలరీలను శరీరానికి అందిస్తాయో అవన్నీ జంకు ఫుడ్సే అవుతాయి. తింటున్నది ఫుడ్డో.. జంకుఫుడ్డో ఎవరికివారే నిర్ణయించుకోవాలి. అదనపు కొవ్వు నిచ్చే ఆహారాలపట్ల అప్రమత్తతగా ఉండే స్థూలకాయం సమస్య తగ్గటానికి సావకాశం వుంటుంది.
కేలరీలు దాక్కునేందుకు శరీరంలో కొవ్వు లేకుండా చేస్తేనే ఊబకాయం తగ్గుతుంది. కొవ్వును పెంచుకుంటూ, కేవలం వరి అన్నాన్ని మానేయటంవలన ఒరిగేదేమీ ఉండదు. అదే నిజమైతే గోధుమ రొట్టెల్ని మాత్రమే తినే ఉత్తరాదివారిలో స్థూలకాయం ఉండకూడదు కదా! దక్షిణాది వారిలో వారికన్నా ఔత్తరాహికుల్లోనే స్థూలకాయులు ఎక్కువగా ఉన్నారు కూడా! వరి, గోధుమల్లాంటి ధాన్యాలకన్నా వాటితోపాటు తినే నూనె పదార్థాలు ఎక్కువ హానికారకం అని అర్థం చేసుకోవాలి.
కొవ్వులో దాగున్నాక ఆ కేలరీలను తగ్గించటం కష్టం అవుతుంది కాబట్టి, కేలరీల సంఖ్యను కొవ్వు కణాల సంఖ్యను, సమానంగా తగ్గించే విధంగా ఆహార ప్రణాళిక రచించుకోవటం అవసరం. నూనెలో వేసి వేయించిన కూరలు, ఊరగాయలు, అత్యంత స్పైసీ కూరలు, నూనె వరద కట్టే వంటకాలూ ఊబకాయ ప్రదాతలని గుర్తించాలి.
సిగరెట్ల పెట్టెమీద పుర్రె బొమ్మ వేసి డేంజర్ అపాయం అని వ్రాసినట్టు, స్థూలకాయానికి కారణం అవుతున్న ఆహార పదార్థాల ప్యాకింగ్ మీద కూడా ఇది కొవ్వుని పెంచుతుంది అనే హెచ్చరిక వ్రాయటం అవసరం. హెచ్చరిక అనేది అవగాహన కలిగించే ఒక ప్రయత్నం. తెలియక తప్పులు అనేకం చేస్తుంటాం. తెలిశాక కూడా తప్పులు చేస్తే బాధ్యత ఎవరికి వారిదే కదా!
డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com